Gossip Garage: బీఆర్ఎస్‌లో ఫస్ట్ టైమ్.. కేటీఆర్‌, హరీశ్‌కు గెలుపు బాధ్యతలు..! కారు పార్టీకి లైఫ్‌ అండ్ డెత్‌గా జూబ్లీహిల్స్ బైపోల్..!

ఈ ఎన్నికలో గెలవకపోతే క్యాడర్, లీడర్లు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే ఏం చేసైనా..ఎలాగైనా సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుని క్యాడర్, లీడర్లతో పాటు..ప్రజల్లోనూ బీఆర్ఎస్‌ మళ్లీ రాబోతుందన్న నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయిందట.

Gossip Garage: గ్రేటర్‌లో ఇప్పటికే ఓ బైపోల్‌లో ఓడిపోయాం. ఇప్పుడు ఇంకో ఉప ఎన్నిక వచ్చింది. ఈ సీటును కూడా కోల్పోతే గ్రేటర్‌లోనే కాదు..స్టేట్‌ వైడ్‌గా ఇంపాక్ట్‌ ఉంటుంది. అందుకే ఏం చేస్తామో తెలియదు.. ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతామో అంతకంటే అవసరం లేదు. ఎట్టైనా చేసి జూబ్లీహిల్స్‌ బైపోల్ గెలవాల్సిందేనని ఫిక్స్ అయిందట బీఆర్ఎస్ పార్టీ. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఫస్ట్ టైమ్‌ ఈ బైపోల్‌ కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ట్రుబుల్ షూటర్ హరీశ్‌ రంగంలోకి దిగబోతున్నారట. జూబ్లీహిల్స్ బైపోల్‌ను బీఆర్ఎస్‌ సెమీఫైనల్‌గా భావిస్తోందా? గెలుపు అవకాశాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారా? ఆ ఉప ఎన్నిక కోసం కారు పార్టీ స్ట్రాటజీ ఏంటి.?

అసలే సిట్టింగ్ సీటు. పైగా పార్టీ ఎమ్మెల్యే చనిపోయారన్న సానుభూతి. అన్నింటికన్నా మించి అధికార కాంగ్రెస్‌ అన్నింట్లో ఫెయిల్‌ అయిందని చెబుతున్నాం. ఇలాంటి సమయంలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరుతామంటోంది బీఆర్ఎస్ పార్టీ. బైపోల్‌లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని..అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్సేనన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలని భావిస్తోందట. ఈ ఉపఎన్నికను లైఫ్‌ అండ్‌ డెత్‌గా తీసుకుంటోందట కారు పార్టీ.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఎన్నికలు సెమీఫైనల్‌గా ఫీల్‌ అవుతోందట. ఈ ఎన్నికలో గెలవకపోతే క్యాడర్, లీడర్లు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే ఏం చేసైనా..ఎలాగైనా సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుని క్యాడర్, లీడర్లతో పాటు..ప్రజల్లోనూ బీఆర్ఎస్‌ మళ్లీ రాబోతుందన్న నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయిందట. అందుకోసం బైపోల్‌ స్ట్రాటజీపై పెద్ద కసరత్తే చేస్తున్నారట బీఆర్ఎస్ ముఖ్యనేతలు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సమన్వయ బాధ్యతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసోజు శ్రవణ్‌లకు అప్పగించారట. పైగా డివిజన్‌ల వారీగా మాగంటి గోపినాథ్‌ సంస్మరణ సభలను నిర్వహిస్తున్నారు.

ఇక పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో సర్వే చేయించిన బీఆర్ఎస్‌కు..పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చిందంటున్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపితే..సానుభూతితో పాటు ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఉన్న నమ్మకం, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమను గెలిపిస్తుందని భావిస్తున్నారట గులాబీ లీడర్లు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్‌ కూడా కారు పార్టీకే సానుకూలంగా ఉందంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు.

Also Read: ఢిల్లీ, చెన్నైలా హైదరాబాద్ కాకుండా చర్యలు, న్యూయార్క్‌తో పోటీ పడేలా కృషి- సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ బైపోల్‌ను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్నారట కారు పార్టీ నేతలు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌ ఏ బైపోల్‌ను ఫేస్‌ చేసినా అయితే కేటీఆర్ లేకపోతే హరీశ్‌రావు ఇంచార్జ్‌గా ఉంటూ వచ్చారు. కానీ జూబ్లీహిల్స్‌కు వచ్చేసరికి కేటీఆర్, హరీశ్‌ ఇద్దరినీ రంగంలోకి దించాలని భావిస్తున్నారట గులాబీ బాస్. బోరబండ, రహ్మత్‌ నగర్, జూబ్లీహిల్స్ బస్తీల్లో హరీశ్‌రావుకు.. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ క్లాస్‌ ఏరియాల్లో కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలతో అటు క్లాస్, ఇటు మాస్‌ పబ్లిక్‌ను అట్రాక్ట్ చేసి ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్.

గతంలో జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా కేటీఆర్, హరీశ్‌ ఒకే నియోజకవర్గంలో పని చేయలేదు. నారాయణ్‌ఖేడ్‌ మొదలు..కంటోన్మెంట్ వరకు..ఏ ఉపఎన్నిక అయినా అయితే కేటీఆర్ లేకపోతే హరీశ్‌రావుకు బాధ్యతలు ఇస్తూ వచ్చారు కేసీఆర్. ఫస్ట్ టైమ్‌ జూబ్లీహిల్స్ బైపోల్‌ బాధ్యతలను ఇద్దరు నేతలకు అప్పగించనున్నారట. సేమ్‌టైమ్ ఎక్కువ శాతం రోడ్‌ షోలు, డోర్‌ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అనుకుంటున్నారట. ప్రతీ డివిజన్‌కు ఓ మాజీ మంత్రిని ఇంచార్జ్‌గా నియమించి..అవసరమైతే జిల్లాల నుంచి క్యాడర్‌, లీడర్లను తెప్పించి డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్ చేయాలని స్కెచ్ వేస్తున్నారట.

ప్రతీ వంద ఓటర్లకు ఓ అబ్జర్వర్‌ను పెట్టి..సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసి భారీ మెజార్టీతో గెలిచే ప్లానే వేస్తోందట బీఆర్ఎస్ పార్టీ. గ్రేటర్‌లో తాము చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ వచ్చాక తెచ్చిన హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో చేసిన నష్టాన్ని వివరించాలని పకడ్బందీ వ్యూహం రచిస్తోందట కారు పార్టీ. మరీ బీఆర్ఎస్‌ వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో.. బైపోల్‌లో గెలుపోటములు ఎలా ఉంటాయో చూడాలి.