High Alert On Corona In Telangana
High alert on corona : తెలంగాణలో కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం హైఅలెర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో మంత్రి ఈటెల రాజేందర్ వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యశాఖ అధికారులు, హాస్పటల్స్ సూపరింటెండెంట్లతో ఆయన మాట్లాడారు.
గత 20 రోజుల్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయని.. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యశాఖ అధికారులు సూచించారు. కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తలు పాటించకపోతే హాస్పిటల్స్లో బెడ్స్ కూడా దొరకకపోవచ్చని వైద్యాధికారులు హెచ్చరించారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కేంద్రం పలు రాష్ట్రాలను అలెర్ట్ చేసిందని.. దేశంలో 50 శాతం కేసులు మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయని వివరించారు.