Hyderabad: దుస్తులపై చట్నీ పడేశాడన్న చిన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు నలుగురు యువకులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.
హైదరాబాద్ శివారులోని ఉప్పల్, కల్యాణపురిలో నివసించే మురళీ కృష్ణ(45) పనిమీద ఎల్బీనగర్ వెళ్లాడు. రాత్రి సమయంలో ఇంటికి రావాల్సి ఉండగా ఉప్పల్ వైపు వెళ్తున్న కారు కనపడింది. మురళీ కృష్ణ లిఫ్ట్ అడగగా కారులోని యువకులు అతడిని ఎక్కించుకున్నారు.
Also Read: నేను రెడీ.. మీరు రెడీనా?: లై డిటెక్టర్ టెస్ట్కు రావాలంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. ఎందుకంటే?
ఉప్పల్లో ఓ టిఫిన్ సెంటర్ వద్ద వారందరు దిగి ఇడ్లీ, బోండాలు తిన్నారు. ఆ సమయంలో మురళీ కృష్ణ ప్లేట్లోని చట్నీ ఓ యువకుడిపై పడడంతో గొడవ చెలరేగింది. చట్నీని తాను ఉద్దేశపూర్వకంగా వేయలేదని మురళీ కృష్ణ చెప్పినప్పటికీ అతడిని ఆ నలుగురు యువకులు కొట్టారు. మురళీ కృష్ణను కారులో ఎక్కించుకుని 2 గంటలపాటు అందులోనే తిప్పుతూ చిత్ర హింసలు పెట్టారు.
నాచారం సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచారు. దీంతో మురళీ కృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. మురళీ కృష్ణ మృతదేహం కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను చెక్ చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
నిందితులు అందరూ 20 ఏళ్లలోపువారే. వారిలో ఒకరు మైనర్. ఆ నలుగురు నాచారం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ జునైద్, షేక్ సైపుద్దీన్, పొన్నా మణికంఠ, ఓ 16 ఏళ్ల బాలుడు అని చెప్పారు.