Pawan Kalyan Election Campaigning in Warangal : వరంగల్ బీజేపీ విజయ సంకల్ప సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో జనసేన పార్టీ నడుస్తుందని అన్నారు. ఏపీలో రౌడీలు, గూండాల పాలన నడుస్తోందని.. అటువంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే అది తెలంగాణ పోరాట స్ఫూర్తే కారణమని అన్నారు. బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించ లేదన్నారు.
Also Read : భూకబ్జాదారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు : సీఎం కేసీఆర్
తనకు ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. తాను పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. కానీ తనను ప్రజలు కోరుకున్నప్పుడు వస్తానని చెప్పానని అలా ఇప్పుడు వచ్చానని అన్నారు. ఏపీలో రౌడీలు, గుండాలను గుండె దైర్యంతో ఎదుర్కొంటున్నాను అంటే అది తెలంగాణ పోరాట గడ్డ ఇచ్చిన స్పూర్తేనన్నారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నా.. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతానని తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తానొక్కడినని అన్నారు.
Also Read : కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుంది : CM కేసీఆర్పై విజయశాంతి మాటల తూటాలు
తెలంగాణలో జనసేన ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని పునరుద్ఘాటించారు.
బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని పవన్ కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని.. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామన్నారు. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలి అందుకే బీజేపీతో కలిశానని అన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. కాగా, తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.