Kodanda Reddy: కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థం లేనివి.. ఆయనకు సెగ తగిలింది: కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
ధరణిలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతోందని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : June 5, 2023 / 04:08 PM IST
Kodanda Reddy
Kodanda Reddy – Congress: తెలంగాణ (Telangana ) సీఎం కేసీఆర్ (KCR)పై కిసాన్ కాంగ్రెస్ (Kisan Congress) జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు 22 లక్షల రైతు కుటుంబాలకు హక్కు పత్రాలు ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ కు రైతుల సెగ తగిలిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థం లేనివని అన్నారు. వీఆర్వో వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థలో కీలకమైనదని తెలిపారు. ధరణిలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతోందని అన్నారు. కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను తీసివేసి తిమింగలాలకు అప్పచెప్పారని తెలిపారు. తనకు అనుకూలమైన అధికారులకు ధరణి వ్యవస్థను కేసీఆర్ అప్పగించారని అన్నారు.
తిమింగలాల్లో పెద్ద తిమింగలం సోమేశ్ కుమార్ అని ఆరోపించారు. ఆంధ్ర క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ ఒక్క రోజు కూడా ఆంధ్రాలో పని చేయలేదని తెలిపారు. సోమేశ్ కుమార్ కు సలహాదారు పదవి ఇచ్చి కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని అన్నారు.
సోమేశ్ కుమార్ పై కేసీఆర్ కు ఎందుకు ప్రేమ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి అవకతవకలపై విచారణ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే భూ గ్యారంటీ చట్టం తీసుకువస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రైతులు ఇంటికి పంపడం ఖాయమని అన్నారు.
బంగాళాఖాతంలో వేస్తాం..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ సర్కార్ తెచ్చిన ధరణి వలన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రూ.10 వేల నష్ట పరిహారం ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని తెలిపారు. రైతులు బీఆర్ఎస్ నేతలను నిలదీస్తే ఇష్టం వచ్చినట్లు రైతులను తిడుతున్నారని అన్నారు.
