Lok Sabha Election 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 17 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే, భువనగిరి నియోజకవర్గం బీజేపీలో గ్రూప్ వార్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర నర్సయ్యగౌడ్ వైఖరిపై సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : కేరళలో ఆసక్తికరంగా ట్రయాంగిల్ ఫైట్.. కంచుకోటను నిలబెట్టుకునేందుకు కామ్రేడ్ల స్కెచ్
బూర నర్సయ్య గౌడ్ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కొందరు సీనియర్ నేతలు అలకబూనారు. నర్సయ్యగౌడ్ కు మద్దతుగా ప్రచారంకు సీనియర్ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, శ్యామ్ సుందర్ తో పాటు పలువురు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల వేళ నేతల మధ్య గ్రూప్ వార్ తో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొనగా.. అధిష్టానంకు బూర నర్సయ్య గౌడ్ వ్యవహారం తలనొప్పిగా మారినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా నర్సయ్య గౌడ్ పనిచేస్తున్నారంటూ ఆయన పై సీనియర్లు విమర్శలు చేస్తున్నారు.