Lok Sabha Election 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ పాలమూరు రాజకీయాలు హీటెక్కాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ అగ్రనేతలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల నేతలు పాలమూరు గడ్డపై తమతమ ప్రచారాలను వేగం పెంచారు. ఈ క్రమంలో ఇవాళ ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ సభలు నియోజకవర్గం పరిధిలో జరగనున్నాయి. గంట తేడాతో పీఎం, సీఎంల బహిరంగ సభలు జరగనుండటంతో వీరి మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నారాయణపేట జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ బహిరంగ నిర్వహించనుంది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు. అదేవిధంగా మక్తల్ పట్టణంలో సాయంత్రం 4గంటలకు కాంగ్రెస్ జన జాతర సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇరు పార్టీలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీ చందర్ పోటీ చేస్తున్నారు. దీంతో జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలోఉన్న డీకే అరుణ గెలుపుకోసం బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా.. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుండడంతో ఈ సీటును రేవంత్, కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఏడు సార్లు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో సీఎం పర్యటించారు. వంశీచంద్ గెలుపుకోసం ఇవాళ మరోసారి పర్యటించనున్నారు.
Also Read : Kcr : పాకిస్థాన్, పుల్వామా పేరు చెప్పి పదేళ్లు పూర్తి చేసుకున్నారు- బీజేపీపై కేసీఆర్ నిప్పులు
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని మహబూబ్ నగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార సభల్లో పాల్గోనున్నారు.
– మధ్యాహ్నం 3.05గంటలకు కర్ణాటక గుల్బర్గా నుంచి నారాయణపేటకు మోదీ చేరుకుంటారు.
– 3.15గంటలకు నారాయణపేట బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకుంటారు.
– 3.15 నుంచి 4.05గంటల వరకు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో డీకే అరుణకు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
– సాయంత్రం 4.15 గంటలకు నారాయణపేట నుంచి 5.10గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు మోదీ చేరుకుంటారు.
– సాయంత్రం 5.25కు ఎల్బీ స్టేడియంకు చేరుకొని 5:30 నుంచి 6.20 వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.
– సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట నుండి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్తారు.
– ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.