Mynampally Hanmanth Rao: వారితో మాట్లాడిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.. తప్పకుండా నా కొడుక్కి నేను సపోర్ట్ చేస్తా
పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఈరోజుకూడా పార్టీ గురించి మాట్లాడను. మెదక్ నియోజకవర్గం నాకు రాజకీయ బిక్ష పెట్టింది నాకు కార్యకర్తలు ముఖ్యం.
- Harishth Thanniru
- Published On : August 22, 2023 / 11:45 AM IST
BRS MLA Mynampally
BRS MLA Mynampally: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సోమవారం తిరుపతిలో మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. పార్టీ నేతలు మైనంపల్లి వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తామంతా మంత్రి హరీష్రావు వెంటే ఉంటామని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలో మైనంపల్లిపై వేటు తప్పదన్న వాదన ఆ పార్టీ నుంచి వ్యక్తమవుతోంది. తాజా అంశాలపై మైనంపల్లి మరోసారి స్పందించారు. నేను పార్టీ గురించి మాట్లాడలేదు, ఈరోజు కూడా పార్టీ గురించి మాట్లాడను అని పేర్కొన్నారు. వారితో సమావేశం అయిన తరువాత నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి స్పష్టం చేశారు.
తిరుమలలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం హరీష్రావుపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఎవరి జోలికి వెళ్లను.. నా జోలికి వస్తే ఊరుకోను. నేను హార్డ్ వర్కర్ని, మా అబ్బాయి సేవా కార్యక్రమాలు చేశాడని తెలిపారు. నా కొడుక్కి నా అవసరం ఉంది. తప్పకుండా నా కొడుక్కి నేను సపోర్ట్ చేస్తా అని మైనంపల్లి చెప్పారు. తిరుమలలో నా ఫీలింగ్స్ చెప్పుకోవడంలో తప్పులేదు. నా జీవితంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్లలేదు. నన్ను ఇబ్బంది పెడితే ఊరుకోను.. అది నా విధానమని చెప్పారు.
పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఈరోజుకూడా పార్టీ గురించి మాట్లాడను. మెదక్ నియోజకవర్గం నాకు రాజకీయ బిక్ష పెట్టింది నాకు కార్యకర్తలు ముఖ్యం. మల్కాజిగిరి ప్రజలు నన్ను ఊహించని విధంగా ఆదరించారు. రెండు నియోజకవర్గాల్లో ప్రజలతో, కార్యకర్తలతో మాట్లాడి తర్వాత నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని మైనంపల్లి హన్మంతరావు చెప్పారు.
