కేరళలో బీజేపీకి అనుకూల వాతావరణం, 6 ఎంపీ సీట్లు గెలుస్తాం: సినీ నటుడు సురేష్ గోపి
తాను ఎంపీగా పోటీ చేసిన త్రిశూర్లో 73 శాతం పోలింగ్ నమోదైందని, కేరళలో ఈసారి బీజేపీ 6 సీట్లు గెలిచే అవకాశం ఉందని మలయాళ సినీ నటుడు సురేష్ గోపి అన్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 4, 2024 / 02:13 PM IST
Suresh Gopi Campaign in Telangana: కేరళలో ఈసారి బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందని, 6 సీట్లు గెలిచే అవకాశం ఉందని మలయాళ సినీ నటుడు సురేష్ గోపి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎంపీగా పోటీ చేసిన త్రిశూర్లో 73 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని కొనసాగిస్తానని తాను ప్రచారం సాగించానని తెలిపారు. మోదీ ఇచ్చిన హామీలను అన్నింటినీ పూర్తి చేశారని చెప్పారు.
”కేరళలో ప్రభుత్వ విధానాలతో ప్రజల ఆలోచనలు మారిపోయాయి. ఈసారి బీజేపీకి కేరళలో ఎక్కువ సీట్లు వచ్చే వాతావరణం కనిపిస్తోంది. 1981లో కేరళకు కేంద్రం ఒక్క జాతీయ రహదారి మాత్రమే ఇచ్చింది, కానీ మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం మూడు జాతీయ రహదారులు నిర్మాణం చేశారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా త్రిశూర్ ప్రజలు నాకు ఓట్లు వేశారని అనుకుంటున్నాను.
ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఓటర్లను కోరుతున్నా. వారిద్దరూ గెలిస్తే కేంద్ర మంత్రి వర్గంలో కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. 8 ఏళ్లుగా కిషన్ రెడ్డితో పరిచయం ఉంది. నేను ఆయనతో చాలాసార్లు కలిసి పనిచేశాను. ఈటెల రాజేందర్తో వ్యక్తి గత పరిచయం లేకున్నా ప్రజల మనిషిగా తెలుసు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్ర మంత్రి చాలా బాగా పనిచేశారు. కచ్చితంగా ఓటర్లు అందరూ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటెయ్యాల”ని సురేష్ గోపి అన్నారు.
Also Read: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్ కీలకంగా మారుతోంది : హరీశ్ రావు
