Graduate MLC Election 2024 : గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు.. రేసులో పలువురు నేతలు
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 15 రోజులకే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను అభ్యర్థిగా ప్రకటించింది.
- Harishth Thanniru
- Published On : April 28, 2024 / 01:39 PM IST
BJP
MLC Election 2024 : వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం గ్రాడ్యుయేషన్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు పలువురు బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే, పల్లా ఖమ్మం- వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ మే 28వ తేదీని ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్సీ స్థానంకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 15 రోజులకే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. బీజేపీ నుంచి రేసులో ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డిలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ హవాలో గ్రాడ్యుయేషన్ స్థానంనుసైతం కైవసం చేసుకునేలా బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
