Minister KTR: తెలంగాణలో అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందన్వల్లి ఎదగనుంది.. అవసరమైతే జపాన్ కంపెనీలకోసం ఒక క్లస్టర్ని ఏర్పాటు చేస్తాం
చందన్వల్లిలో ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకోసం అవసరమైతే ఒక క్లస్టర్నికూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
- Harishth Thanniru
- Published On : July 14, 2023 / 01:27 PM IST
Minister KTR
Minister KTR : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందన్వల్లి ఎదగనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా (RangaReddy District) చందన్వల్లి (Chandanvelly) ఇండస్ట్రీయల్ పార్కు (Industrial park) లో జపాన్ (Japan) కు చెందిన డైఫుకు(Daifuku’s) ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ (Nicomac Taikisha clean rooms) కంపెనీల ఏర్పాటు పనులకు మంత్రి కేటీఆర్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు కంపెనీల ఫ్యాక్టరీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందని తెలిపారు. జపాన్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని వస్తామని, అతి తక్కువ సహజ వనరులు అందుబాటులో ఉన్న అద్భుతమైన దేశంగా జపాన్ ఎదిగిందని మంత్రి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినప్పటికీ వాటిని ఎదుర్కొని జపాన్ నిలబడుతున్నదని అన్నారు.
భారతదేశంలోని ప్రతి ఇంటిలో ఏదో ఒక జపాన్ ఉత్పత్తి ఉంటుంది. ఈరోజు తమ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ రెండు కంపెనీలుకూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విజయం సాధిస్తాయని నమ్ముతున్నానని కేటీఆర్ అన్నారు. రూ.575 కోట్ల పెట్టుబడి ద్వారా 1600 ప్రత్యక్ష ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇక్కడ స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కంపెనీలు హామీ ఇచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కంపెనీలలో వచ్చే ఉద్యోగాలకు అవసరమైన శిక్షణనుకూడా అందించనున్నాయని అన్నారు.
చందన్వళ్లి పారిశ్రామిక పార్కుకోసం స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు ఇచ్చిన సహకారం వల్లనే పెద్దఎత్తున కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ స్థానికులను అభినందించారు. టెక్స్టైల్ నుంచి మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాలుదాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయని మంత్రి తెలిపారు. అతర్జాతీయంగా పేరు కలిగిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందన్వల్లి ఎదగనున్నదని మంత్రి చెప్పారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఇందుకు అవసరమైన సహకారాలను జపాన్ కాన్సులేట్ నుంచి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు.
Minister KTR: బెంగళూరు, చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది
చందన్వల్లిలో ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకోసం అవసరమైతే ఒక క్లస్టర్నికూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జపాన్ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వంకూడా నిర్దిష్ట సమయంలో ఈ రెండు కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులోనూ ఇంతే ప్రభావవంతమైన తమ ప్రభుత్వ పనితీరును కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
