KTR
Minister KTR BioAsia Conference : ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందన్నారు. ఇక్కడ 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో 20వ బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మూడింట ఒక వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుందని వెల్లడించారు.
దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణ స్థానం ఉందన్నారు. ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. లైఫ్సైన్స్ రంగంలో ప్రపంచ హబ్గా హైదరాబాద్ ఉందన్నారు. ఇక్కడ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్గా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. గత 7 సంవత్సరాల్లో 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.
నగరంలో 20కిపైగా లైఫ్సైన్సెస్, మెడ్టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2023కుగాను ‘జీనోమ్ వ్యాలీ’ ఎక్స్లెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్కు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
బయో ఏషియా సదస్సులో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సు మూడు రోజుల పాటు జరుగనుంది. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్టెక్, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు ఉండనున్నాయి. వివిధ అంశాలపై బృంద చర్చలు జరుపనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరయ్యారు.