Minister Prasanth Reddy: ఆంధ్రా ప్రజలను కాదు.. పాలకులనే అన్నా: మంత్రి వేముల
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్లను ఆపకపోతే పోరాటం తప్పదని ఏపీ సీఎం జగన్ను హెచ్చరించారు.
- Naresh Mannam
- Published On : June 23, 2021 / 11:10 AM IST
Minister Prasanth Reddy
Minister Prasanth Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్లను ఆపకపోతే పోరాటం తప్పదని ఏపీ సీఎం జగన్ను హెచ్చరించారు. కొత్త ప్రాజెక్ట్లు కట్టడం లేదని గ్రీన్ట్రిబ్యునల్కు చెప్పి దొంగతనంగా కడుతున్నారని.. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు.
ఈ సందర్భంలోనే దివంగత నేత వైఎస్పైనా విమర్శలు చేశారు ప్రశాంత్రెడ్డి. ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ రాక్షసుడైతే జగన్ ఒక నీటి దొంగని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశంగా మారింది. అయితే.. బుధవారం మరోసారి ఇదే విషయంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో కూడా ముమ్మాటికీ వైఎస్ఆర్ తెలంగాణ పాలిట రాక్షసుడేనన్న మంత్రి.. అక్రమ ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటిని దొంగిలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంకేమనాలని ప్రశ్నించారు.
మంగళవారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని పేర్కొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అయితే.. తన వ్యాఖ్యలను ఆంధ్రా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అన్నట్లుగా సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు కేవలం ఆంధ్రా పాలకులను ఉద్దేశించి అన్నవేనని.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ అడ్డుపడ్డాడని.. తెలంగాణ నీటిని దొంగించాడని.. ఎన్నో అరాచకాలను చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఉద్దేశించి.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని.. ప్రజలను ఉద్దేశించి కాదన్నారు.
