ఎన్ని కేసులు పెట్టినా ఆ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ ఇవ్వడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
- Harishth Thanniru
- Published On : December 13, 2024 / 12:07 PM IST
MLC Kavitha
MLC Kavitha : తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ ఇవ్వడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేపు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూశామని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటాం.. జీవో ఇస్తేనే ప్రాణత్యాగాలు చేసిన వారి విగ్రహాలు పెడతామా అంటూ కవిత ప్రశ్నించారు. బ్రిటీష్ సర్కార్ కూడా భరతమాత మీద ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లిపై గెజిట్ ఇవ్వడం దారుణమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Congress Party : కాంగ్రెస్ అబద్ధాల పునాదిపై కాలం గడుపుతోంది
కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదం. కాంగ్రెస్ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవు అంటూ కవిత విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఓట్ల కోసం బతుకమ్మ ఆడారు. రాష్ట్ర పండుగ అని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఎన్ని జీవోలు ఇచ్చినా మా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.. మాకు ఆ స్వేచ్ఛా స్వాంతంత్రం ఉండాలి.. కేసులకు మేము భయపడమని కవిత స్పష్టం చేశారు. ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు.. విగ్రహం తయారు చేసే వరకు రహస్యంగా ఉంచారని కవిత ప్రశ్నించారు.
