MLC Tata Madhusudan : స్పీకర్ వ్యాఖ్యలపై తాతా మధు క్లారిటీ.. అసలు ఆయన ఎవరు? విద్యార్థి ఉద్యమం నుంచి ఎమ్మెల్సీగా..!
MLC Tata Madhusudan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆయన రాజకీయ ప్రస్థానం, నేపథ్యం ఇదే.
- Sreehari A
- Updated on- September 7, 2026 / 06:44 PM IST
MLC Tata Madhusudan
- తాతా మధు ఎవరు? ఆయన రాజకీయ ప్రయాణం ఇదే!
- స్పీకర్ వ్యాఖ్యల వేళ తాతా మధు పేరు హాట్ టాపిక్
- ఎస్ఎఫ్ఐ నుంచి ఎమ్మెల్సీ వరకు
- అమెరికాలో ఉద్యోగం.. తెలంగాణలో రాజకీయం..
MLC Tata Madhusudan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. ఇప్పుడు ఈ పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాజకీయంగా చర్చను లేవనెత్తింది.
ఈ నేపథ్యంలో తాను స్పీకర్ను అవమానించే ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు స్పష్టం చేశారు. పోలీసుల వ్యవహారశైలిపై (MLC Tata Madhusudan) ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలోనే తన మాటలు వచ్చాయని ఆయన వివరణ ఇచ్చారు.
ఎవరీ తాతా మధు? :
ఈ నేపథ్యంలో తాతా మధు రాజకీయ నేపథ్యం కూడా మరోసారి చర్చలోకి వచ్చింది. ఆయన పూర్తి పేరు తాతా మధుసూదన్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ఆయన స్వస్థలం. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేశారు. అనంతరం వామపక్ష రాజకీయాల్లో కొనసాగారు.
ఉస్మానియా యూనివర్శిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. పీజీతో పాటు న్యాయ విద్యను కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అట్లాంటాలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. అక్కడే హోటల్ వ్యాపారంలోనూ కొనసాగారు. అమెరికాలో ఉన్న సమయంలో తెలుగు సంఘాల కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు.
ప్రజారాజ్యం టు బీఆర్ఎస్ :
తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన తాతా మధు ప్రజారాజ్యం పార్టీలో ముందుగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యతలు నిర్వహించారు. 2021లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తాతా మధు విజయం సాధించారు. అప్పటి నుంచి శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.
స్పీకర్ వ్యాఖ్యలపై తాతా మధు వివరణ
ప్రస్తుతం స్పీకర్పై వ్యాఖ్యల అంశంలో రాజకీయ దుమారం నేపథ్యంలో తాతా మధు తన వైఖరిని వివరిస్తూ స్పష్టత ఇచ్చారు. స్పీకర్ పదవికి తాను గౌరవం ఇస్తానని, తన వ్యాఖ్యలను మరో విధంగా అర్థం చేసుకోవద్దని పేర్కొన్నారు.
Read Also : CM Revanth Reddy : స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి
శాసనసభలోకి మహిళా శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తున్న క్రమంలో తోపులాట జరిగిందని తాతా మధు చెప్పారు. ఈ క్రమంలో తనపై దాడి జరిగిందని అన్నారు. అంతేకాదు.. తన షర్టు, ఫ్యాంటు లాగేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నించినట్లు అనిపించిందని పేర్కొన్నారు.
కొంతమంది తనపై దుర్భాషలాడినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలిపారు. తనపై దాడి చేసింది ఎవరు? షర్టు లాగేందుకు ఎవరు ప్రయత్నించారు? అలా చేయమని ఎవరు ఆదేశించారు? అంటూ తాను ప్రశ్నించినట్లు వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలను స్పీకర్ను ఉద్దేశించి చేసినవిగా భావించడం సరికాదన్నారు. స్పీకర్ వ్యవస్థ, ఆయన పట్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉందని తెలిపారు.
స్పీకర్ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యల్లో ఏదైనా స్పీకర్ను ఉద్దేశించినట్టు భావిస్తే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, ఈ వ్యాఖ్యలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానంటూ వివరణ ఇచ్చారు.
