Allu Arjun
Chamala Kiran kumar Reddy: సినీ నటుడు అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత.. అల్లు అర్జున్ హడావుడిగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నాము. కానీ, రియల్ హీరోగా కాకుండా రీల్ హీరోగా ప్రవర్తించారు. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బెన్ఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని పేర్కొన్నారు.
Also Read: KTR: సవాల్ విసిరితే తోక ముడిచారు.. ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. అంటే.. మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప, ప్రజలు ఏమైతుండ్రు, బయట ఏం జరుగుతుందనే ధ్యాస లేదు. అల్లు అర్జున్ రియల్ హీరోగా మాట్లడలేదు. స్ర్కిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉంది. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తున్నారో మీకే క్లారిటీ లేదంటూ అల్లు అర్జున్ తీరును విమర్శించారు.
బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ, ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దని కాంగ్రెస్ ఎంపీ సూచించారు. నా క్యారెక్టర్ ను దెబ్బతీశారు అని అల్లు అర్జున్ అనడం విడ్డూరంగా ఉంది. సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.