KTR: సవాల్ విసిరితే తోక ముడిచారు.. ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి.. రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్..

KTR
KTR – Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై అర్థంలేని కక్ష పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి నోరు తెరవని పాలమూరు బిడ్డ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా ప్రభుత్వానికి పట్టడం లేదని, కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా ఈ ప్రభుత్వానికి చలనం లేదని కేటీఆర్ అన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పోతున్న తెలంగాణ పరువు. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతకుముందు కేటీఆర్ మరో ట్వీట్ లో రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా అంటూ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారు. వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం.. రుణమాఫీ కానీ రైతన్నలకు ఏం సమాధానం చెబుతుంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: PM Narendra Modi : అరబిక్లోకి రామాయణం, మహాభారతం.. అనువాదకుడిని ప్రశంసించిన మోదీ
రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి.. రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్.. రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదాం అంటూ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ చేశారు. రుణమాఫీ మాయ, రైతు భరోసా రూ. 7500 మాయ, తులం బంగారం మాయ, మహిళలకు రూ. 2500 మాయ, రూ.4వేలు ఆసరా పింఛన్లు మాయ, రూ. 6వేల దివ్యాంగుల పింఛన్లు మాయ.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.