Dammaiguda Girl Death Case : కలకలం రేపిన దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారిది హత్య కాదని తేలింది. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అని పోలీసులు గుర్తించారు. బాలిక చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆడుకోవడానికి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇందు ఎక్కడా సరైన ప్రదేశం లేకపోవడంతో టాయ్ లెట్ కోసం చెరువు దగ్గరికి వెళ్లిందని అక్కడ కాలు జారి చెరువులో పడిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చిన్నారి ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు డాక్టర్లు.
ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఇందు.. దమ్మాయిగూడలోని అంబేడ్కర్ నగర్ చెరువులో విగతజీవిగా కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. స్కూల్ కి వెళ్లిన చిన్నారి ఎలా చనిపోయింది అనేది మిస్టరీగా మారింది. బాలికను ఎవరైనా చంపారా? అనే డౌట్స్ వచ్చాయి. అదే సమయంలో పాత వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో ఓ చిన్నారి శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. వాటిని చూసి అందరూ ఇందు శరీరంపై గాయాలు ఉన్నాయని.. హత్యేనని అనుమానించారు. చెరువు చుట్టుపక్కల ఉండే గంజాయి బ్యాచ్.. బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసి ఉంటుందని స్థానికులు ఆరోపించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
అయితే ఆ వీడియోలు ఇందుకి సంబంధించినవి కాదని తేలింది. ఇందు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడటం వల్లే ఇందు మరణించిందన్నారు.
దమ్మాయిగూడ జవహర్ నగర్కు చెందిన నరేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు ఇందు ఈ నెల 15న స్కూల్ కి వెళ్లింది. తన బ్యాగుని క్లాస్ రూమ్ లో పెట్టి ఒంటరిగానే బయటకు వెళ్లింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అటెండెన్స్ తీసుకునే సమయంలో ఇందు కనిపించలేదు. దీంతో క్లాస్ టీచర్, విద్యార్థులు ఇందు కోసం అంతా వెతికారు. కంగారుపడిన టీచర్.. వెంటనే ఇందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టిన పోలీసులు అనేక కోణాల్లో ఎంక్వైరీ చేశారు.
చిన్నారి చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేక ఎవరైనా తోసేసారా..? చిన్నారిపై ఎవరైనా అఘాయిత్యం చేసి హత్య చేశారా? ఇలా అన్ని యాంగిల్స్ లోనూ విచారణ చేశారు పోలీసులు. అయితే, చెరువులో పడి, నీరు మింగి మునిగిపోయి.. ఇందు చనిపోయినట్లుగా వైద్యులు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారించారు. అదే నిజమని పోలీసులు సైతం నిర్ధారించారు.