Nagoba Jatara : నాగోబా జాతర ప్రారంభం.. మహాపూజతో శ్రీకారం.. పోటెత్తిన భక్తులు
Nagoba Jatara : అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతర ముగిసే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
- Harishth Thanniru
- Updated on- January 18, 2026 / 02:03 PM IST
Nagoba Jatara
Nagoba Jatara : అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గంగా జలాలతో పాటు కోనేరులోని నీటితో నాగోబా ఆలయానికి మోస్రం వంశస్తులు వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో మోస్రం ఆడపడుచులు మట్టి పుట్టలు తయారు చేస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాకి అభిషేకం, మహాపూజ నిర్వహిస్తారు. అనంతరం భేటింగ్ కార్యక్రమం ఉంటుంది. కొత్త కోడళ్లను నాగోబాకి పరిచయం చేయడమే ఈ బేటింగ్.
ఏటా దేశంలోనే ఆదివాసీ గిరిజనులు జరుపుకునే రెండో అతిపెద్ద జాతర నాగోబా. జాతర కత్రువులో భాగంగా మెస్రం వంశీయుల్లోని 22 తెగలవారు కుటుంబ సమేతంగా మర్రి చెట్ల నీడలో సేద తీరుతారు. మట్టి కుండల్లోని జొన్న గటుకను నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్త కోడళ్లను నాగోబా దేవుడికి పరిచయం (బేటింగ్) చేస్తారు.
ఈ జాతరలో భాగంగా ఈనెల 22న నాగోబా దర్బార్ హాల్లో దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీన జాతర ముగియనుంది. జాతరలో భాగంగా ఐదవ రోజు భేతాల్, మండగాజలింగ్ పూజలతో మెస్రం వంశస్తులు తంతు ముగియనుంది. ఉత్సవాలకు ఐదు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనులు, భక్తులు పెద్దెత్తున తరలిరానున్నారు.
జాతర ముగిసే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సు సౌకర్యంను అధికారులు కల్పించనున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 100 సీసీ కెమెరాలు, 350మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
