Telangana: మందు బాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్.. విదేశీ బ్రాండ్లు కూడా..
తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయి.
- Harishth Thanniru
- Published On : April 9, 2025 / 02:33 PM IST
Liquor
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయి. ఇందులో విదేశీ బ్రాండ్లూ ఉండనున్నాయి. కొత్త బ్రాండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానించింది. ఈ మేరకు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. దీంతో మద్యం తయారీదారులు, సరఫరాదారులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు.
రాష్ట్రంలో 604 రకాలైన కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతికోసం 92 మద్యం తయారీ, సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో విదేశీ బ్రాండ్లు 273 వరకు ఉండగా.. స్వదేశీ బ్రాండ్లు 331 ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాలైన మద్యం సరఫరా చేస్తున్న 45 పాత కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం 47 కొత్త కంపెనీలు 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకురావడానికి దరఖాస్తులు సమర్పించాయి.
Also Read: RBI Repo Rate: ఈఎంఐ చెల్లింపుదారులకు గుడ్న్యూస్.. మరోసారి రేపో రేటు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం..
రాష్ట్రంలో 2620 ఏ-4 మద్యం దుకాణాలు, 1176 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. రాష్ట్రంలో 2025-26లో రూ. 27,623.36 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీర్ల ధర పెంచడంతో పాటు కొత్తగా 24 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే కొత్త బ్రాండ్లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం 604 కొత్త బ్రాండ్లకు దరఖాస్తులురాగా.. ధరఖాస్తుల పరిశీలన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం రాష్ట్రంలో విక్రయించేందుకు అనుమతి ఇవ్వనుంది.
