హైడ్రా నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే నేనే కూల్చేస్తా: పట్నం మహేందర్ రెడ్డి
నేను రాజకీయాల్లో ఉన్న కాబట్టి తప్పు చేయొదన్న ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి నిబంధనల మేరకు అక్కడ ఫాంహౌస్ నిర్మించాం.
- Naga Srinivasa Rao Poduri
- Published On : August 27, 2024 / 01:17 PM IST
patnam mahender reddy clarity on his farm house encroachment
patnam mahender reddy : హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్సందించారు. నిబంధనల ప్రకారమే తన ఫౌంహౌస్ నిర్మించానని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే తానే కూల్చివేస్తానని ఆయన అన్నారు. హైడ్రా నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదని, చెరువుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”కొత్వాల్గూడలో మా కుమారుడి 14 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. అది పట్టా భూమి, 1999లో కొన్నాం. నేను రాజకీయాల్లో ఉన్న కాబట్టి తప్పు చేయొదన్న ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి నిబంధనల మేరకు అక్కడ ఫాంహౌస్ నిర్మించాం. 2005లో అనుమతి తీసుకుని, కలెక్టర్తో మాట్లాడాకే భవనం నిర్మించాం. నేను భవన నిర్మాణం చెరువులో చేశానని తేలితే చర్యలు తీసుకోండి. నేను కూడా పూర్తిగా సహకరిస్తాను. నేను తప్పు చేయలేదు.. ఒకవేళ తప్పని తేలితే నేనే కూల్చేస్తా.
Also Read: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
నాకు అక్కడ భవనంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మా తాత ఇచ్చిన భూముల్లో మాకు చాలా ఉన్నాయి. చెరువును కబ్జా చేసే అవసరం నాకు లేదు. సీఎం రేవంత్ రెడ్డి చెరువులను కాపాడటానికి తీసుకుంటున్న చర్యలు బావున్నాయి. చెరువులను రక్షించే కార్యక్రమం చాలా మంచిది. హైడ్రా నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. మా భవనానికి ప్రత్యేకంగా రోడ్డు వేయించుకోలేదు.. రోడ్డు గ్రామ పంచాయతీ నిర్మించింది. 111 జీఓ పరిధిలో నా ఒక్కడిదే కాదు, వేల మంది భూములున్నాయి. నా ఫాంహౌస్ అక్రమంగా కట్టారని కేటీఆర్ చెప్పారు.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేటీఆర్ అయినా వచ్చి కూల్చేయవచ్చు. కేటీఆర్ తెలియక మాట్లాడి ఉంటార”ని మహేందర్ రెడ్డి అన్నారు.
