Bandi Sanjay (Photo : Twitter)
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బాన్సువాడకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ నెల 23న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు. యువత భవిష్యత్ కంటే కేసీఆర్ కు రాజకీయాలే ముఖ్యమని ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించటం లేదని బండి సంజయ్ నిలదీశారు.
రోజ్ గారి మేళా పేరుతో కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ.. కేసీఆర్ సర్కార్ హాయాంలో స్కామ్ గా మారిందన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు బండి సంజయ్.
”మంత్రి హరీశ్ రావుకి అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో చెప్పాలి. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుంది. పాలమూరు ప్రజలకు తాగు నీళ్ళు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ది. తాగునీటి కోసం వేసవిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథతో ప్రజలకు తాగునీరు రాకపోగా.. వందల కోట్ల ప్రజాధనం దోచుకున్నారు.
చంద్రబాబు కేబినెట్ లో స్టేషనరీ కుంభకోణంలో బర్తరఫ్ అయిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అప్పుడే అవినీతి మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి పేరు ఉంది. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోంది. బాన్సువాడ ప్రజల సొమ్మును అడ్డగోలుగా పోచారం, ఆయన కొడుకులు దోచుకుంటున్నారు. బాన్సువాడ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పండి. నీతివంతమైన పాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వండి” అని బండి సంజయ్ కోరారు.