YS Sharmila : టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని.. గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదన్నారు.

YS Sharmila : టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని.. గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

YS Sharmila

YS Sharmila : గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త బోర్డు వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఒక కమిషన్ లో జరిగిన అతిపెద్ద స్కాం అని అన్నారు. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మి 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని పేర్కొన్నారు. ఈ పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని ఆరోపించారు.

ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ కేసులో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని పేర్కొన్నారు. పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోందని విమర్శించారు. ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై హైకోర్టులో కీలక విచారణ

కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పేపర్లు లీక్ చేశారని, మరెవరి ప్రమేయం లేదని కేసును మూసివేసే కుట్ర జరుగుతోందన్నారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులే పేపర్ లీక్ చేశారని జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారని వెల్లడించారు. దర్యాప్తుకు ముందే దోషులు ఎవరనేది తేల్చేశారని తెలిపారు. తనకేం సంబంధం లేదని చెప్పుకొస్తున్న మంత్రి దోషులను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ తీరుందని ఎద్దేవా చేశారు.  అంతేకాక కీలకమైన డాటా మంత్రి చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.

పలు వేదికల్లోనూ పరీక్షలు ఎవరెవరు రాశారో చెప్పేస్తున్నారని వెల్లడించారు. ఇతరులకు దొరకని డాటా కేవలం మంత్రికి మాత్రమే ఎలా అందిందని ప్రశ్నించారు. పేపర్ లీకుల వెనుక బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రెటరీ, బోర్డు సభ్యుల దగ్గర నుంచి ప్రగతి భవన్ మంత్రుల వరకు లింకులు ఉన్నాయని ఆరోపించారు. పెద్దల హస్తం ఉంది కాబట్టే ఈ ప్రభుత్వానికి సీబీఐతోనో లేక సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడతాయని భయం పట్టుకుందన్నారు. తీగ లాగితే ఈ కేసు.. ప్రగతి భవన్ డొంక కదులుతుందని ముఖ్యమంత్రి భయపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఇప్పటివరకు పేపర్ లీకులపై సీఎం కనీసం రివ్యూ చేయలేదని విమర్శించారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ

లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో కేసీఆర్ బయటకు వచ్చి భరోసా ఇచ్చింది లేదన్నారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ స్కాం జరిగి నెలన్నర దాటిందన్నారు. స్వయంగా చైర్మన్ జనార్ధన్ రెడ్డి విచారణను ఎదుర్కొన్నారని తెలిపారు. పేపర్ లీకుల వెనుక ఆయన హస్తం లేదని సిట్ ఇంకా క్లీన్ చీట్ కూడా ఇవ్వలేదు. ఇంత పెద్ద తప్పిదం కమిషన్ లో జరిగితే ఒక్క చిన్న చర్య కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదన్నారు. తక్షణ చర్యలుగా బోర్డు రద్దు చేయలేదని చెప్పారు. కనీసం చైర్మన్ ను కూడా బర్తరఫ్ చేయ లేదన్నారు. జనార్ధన్ రెడ్డి సైతం నైతిక బాధ్యత వహించి రాజీనామా కూడా చేయలేదని చెప్పారు.

పైగా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి నమ్మకాలు, అమ్మకాలు, మోసపోయాం అంటూ అర్థ పర్థం లేని మాటలు చెప్తున్నారని వెల్లడించారు. కేసు విచారణ జరుగుతుండగానే, దోషులు ఎవరో ఇంకా నిర్ధారణ కాకముందే, రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన మళ్లీ రద్దయిన పరీక్షలను నిర్వహిస్తోందన్నారు. దొంగలకే తాళాలు అప్పజెప్పినట్లు పేపర్ లీకుల వెనుక ఉన్న సూత్రధారులతోనే పరీక్షల నిర్వహణ జరుగుతోందన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేపర్ లీకులు జరిగినా, తప్పులు దొర్లినా, చైర్మన్లు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సంఘటనలున్నాయని గుర్తు చేశారు.

YS Sharmila Complaint : బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

ఒక్క పేపర్ లీక్ అయితేనే చైర్మన్ ని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. స్వయంగా మంత్రులను సైతం బర్తరఫ్ చేశారని పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15పేపర్ల వరకు పరీక్షా పత్రాలు లీక్ అయినా ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. నిరుద్యోగుల నుంచి ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతుండడంతో విషయం పక్కదారి పట్టించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్నికలు దగ్గర పడడంతో ఉద్యోగాలు ఇవ్వలేదనే మచ్చను తుడిపేసుకునేందుకు నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుందని విమర్శించారు. ఇప్పటికే అన్ని పేపర్లు లీక్ అయినా.. అదే పాత కమిషన్ నుంచే పరీక్షలు నిర్వహిస్తే పేపర్లు లీక్ కావన్న గ్యారెంటీ లేదన్నారు. కనీసం ఒక విజిలెన్స్ ను సైతం ఏర్పాటు చేయలేదన్నారు. పేపర్ లీకుల విషయంలో ఇంటి దొంగలను పట్టుకోకుండా వారితోనే పరీక్షలు నిర్వహించడం ఆమోదకరమైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

YS Sharmila : ఆరోగ్య తెలంగాణ అంటే.. ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను పడేయడమా? : వైఎస్ షర్మిల

అయితే, రాష్ట్ర గవర్నర్ గా విచక్షణాధికారాలు ఉపయోగించి బోర్డును రద్దు చేసేలా చూడాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం రద్దు విషయమై రాష్ట్రపతికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకొనే బాధ్యత గరర్నర్ పై ఉందని సవినయంగా గుర్తు చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ నిర్ణయంపై 30 లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. తక్షణం బోర్డు రద్దు కోసం సిఫారసు చేసి, కొత్త బోర్డు ఏర్పాటు చేసే దిశగా తోడ్పాటు అందించి, నిరుద్యోగులకు న్యాయం చేస్తారని భావిస్తున్నామని గవర్నర్ ను కోరారు.