10th Question Paper Leak: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు..
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : April 4, 2023 / 11:08 AM IST
10th Question Paper Leak
10th Question Paper Leak: తెలంగాణ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు వేగవంతం చేసింది. మరోవైపు అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల వల్లే పేపర్ లీకైందని, ఈ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో పదవ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభంలోనే పరీక్షా ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ కేంద్రం నుంచి తెలుగు పేపర్ లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. తాజాగా టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు. తాండూర్ గవర్నమెంట్ స్కూల్లో పదో తరగతి పరీక్ష రాసేందుకు 260 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా 11 రూంలలో పరీక్షలు రాశారు. విధుల్లో మొత్తం 12 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. వీరిలో రూమ్ నెంబర్ 5లో రిలీవర్గా ఉన్న బండ్యప్ప, అదే రూంలో అబ్సెంట్ అయిన విద్యార్థి క్వశ్చన్ పేపర్ను ఫోటో తీశాడు. మరో స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పని చేస్తున్న సమ్మప్పకు వాట్సప్ ద్వారా పంపించాడు.
బండ్యప్ప వాట్సాప్ ద్వారా పంపించిన 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రాన్ని సమ్మప్ప మరికొంత మందికి షేర్ చేశాడు. అదికాస్త ఆయా వాట్సాప్ గ్రూపులకు చేరింది. ఈ ఘటనలో బండ్యప్ప, సమ్మప్ప ఇద్దరిపై ఐపీసీ 409, మాల్ ప్రాక్టీస్ యాక్ట్ సెక్షన్ 5, 10 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
