MLC constituencies : తెలంగాణలో కీలక పోరు ప్రారంభమైంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలేట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు ఓటర్లు. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్… ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు స్థానాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఓటింగ్ శాతం మధ్యాహ్నం 12 గంటల వరకు :
మహబూబ్ నగర్ 22.67 శాతం, నారాయణపేట్ లో 18.26 శాతం. నాగర్ కర్నూలు లో 21.29 శాతం. మేడ్చల్ మల్కాజ్ గిరి 20.47 శాతం. వికారాబాద్ లో 25.09 శాతం. జోగులాంబ గద్వాల 26.36 శాతం. వనపర్తి 23.83 శాతం. రంగారెడ్డి జిల్లాలో 17.16 శాతం. హైదరాబాద్ లో 19.57 శాతం పోలింగ్ నమోదైంది.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఓటింగ్ శాతం మధ్యాహ్నం 12 గంటల వరకు :
ఖమ్మం జిల్లాలో 20.23 శాతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 24.58 శాతం పోలింగ్ నమోదైంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి 93మంది.. ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు జంబో బ్యాలెట్ను సిద్ధం చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 10 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానంలో అనూహ్యంగా పోటీకి దిగిన మాజీ ప్రధాని పీవీ కూతురు తన తండ్రి ఇమేజ్ను అధికార పార్టీ చేసిన అభివృద్ధిని నమ్ముకుని పట్టభద్రుల ముందుకెళ్లారు. ఆమెను గెలిపించేందుకు మంత్రులు రంగంలోకి దిగి పోల్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు. మరోవైపు వరంగల్ – ఖమ్మం-నల్లగొండ సిట్టింగ్ స్థానంలో ఉన్న పల్లా రాజేశ్వర్ కూడా మరోసారి గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు..ప్రైవేట్ టీచర్లు, గ్రాడ్యుయేట్లను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహాలను అవలంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి, వరంగల్లో రాములు నాయక్ బరిలో ఉన్నారు. కరీంనగర్లో కలిసి వచ్చిన విధంగానే.. ఈ స్థానాల్లోనూ గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది.
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ బరిలో ఉన్నారు.. బీసీ మంత్రాన్నే నమ్ముకుని గ్రాడ్యేయేట్ల ముందుకు వెళ్లారు. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్, వరంగల్లో ప్రొఫెసర్ కోదండరాం స్వతంత్ర అభ్యర్థులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.