Thummala Nageswara Rao: తుమ్మలతో సమావేశమైన పొంగులేటి.. ఆ తర్వాతే తన రాజకీయ జీవితాన్ని ముగిస్తానని తుమ్మల కామెంట్స్
జిల్లాలో గోదావరి జలాలను తన కళ్లతో చూడాలని ఉందని, అ నీళ్లు వచ్చిన తరువాత..
- T Venkateshwarlu
- Published On : September 2, 2023 / 11:45 AM IST
Thummala Nageswara Rao- Ponguleti Srinivasa Reddy
Thummala Nageswara Rao- Ponguleti Srinivasa Reddy: ఖమ్మం(Khammam)లోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి కాంగ్రెస్ నేత పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. అలాగే, ఆ ప్రాంతంలో తుమ్మలన్నా.. రా…. కదలిరా అంటూ ప్లేక్సీలు వెలిశాయి. తుమ్మల, పోంగులేటి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలను పొంగులేటి కోరారు. బీఆర్ఎస్ లో తమకు జరిగిన అన్యాయంపై కూడా మాట్లాడుకున్నారు. అప్పట్లో సిట్టింగ్ ఎంపీకి సీటు ఇవ్వ లేదని, ఇప్పుడు పాలేరు టిక్కెట్ తుమ్మలకు ఇవ్వకపోవడం బాధాకరమని పొంగులేటి అన్నట్లు తెలుస్తోంది. ఇద్దరం కలిసి పని చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జనాల కోసం పాటుపడే నాయకుడు తుమ్మల అని చెప్పారు. బీఆర్ఎస్ కి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు శాతం ఓట్లు లేని రోజుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. అనంతరం కొంత మంది కుయుక్తులు పన్నారని, తనను అవహేళనకు గురి చేశారని అన్నారు.
పొమ్మనకుండా పొగ పెట్టారని వాపోయారు. మొదట తనను బీఆర్ఎస్ లో నుంచి సాగనంపి, అనంతరం తుమ్మలను పార్టీ నుండి బయటకు పంపారని చెప్పారు. కాంగ్రెస్ పక్షాన తుమ్మలను, ఆయన మద్దుతుదారులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ తన పతనానికి తానే నాంది పలికారని విమర్శించారు. తుమ్మల నిర్ణయం ప్రజలు, అభిమానులు ప్రజల కోరిక మేరకు ఉంటుందని చెప్పారు.
అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… పొంగులేటి తన చిరకల మిత్రుడని చెప్పారు. తన కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. రాజకీయ జీవితం స్వార్థం కోసం, కుటుంబం కోసం కాదని, ప్రజలు జీవితాలు మెరుగు పడటం కోసం ఉండాలని హితవు పలికారు.
తాను జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. జిల్లాలో గోదావరి జలాలను తన కళ్లతో చూడాలని ఉందని, అ నీళ్లు వచ్చిన తరువాత రాజకీయ జీవితాన్ని ముగిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు.
