Road accident at Jadcharla in Mahbubnagar district
Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో 15మందికి గాయాలయ్యాయి. భూరెడ్డిపల్లి వద్ద హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కారును తప్పించబోయి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ తో పాటు ప్రయాణికుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
తొలుత బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం స్థానిక మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన ప్రయాణికుడు కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.