మద్యం ప్రియులకు సర్కార్ బిగ్ షాక్..! భారీగా ధరలు పెంపు..?

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2వేల 260 మద్యం దుకాణాలకు 1171 బార్లు కూడా ఉన్నాయి.

Liquor Prices To Be Increased (Photo Credit : Google)

Liquor Rates To Be Hiked : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇవ్వబోతోంది. రాష్ట్రంలో మందు ధరలు అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. బీర్లతో పాటు మద్యం ధరలను 15 శాతం మేర పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మద్యం ధరల పెంపు ద్వారా సుమారు 5వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

20 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం..!
తెలంగాణలో బీర్లు సరఫరా చేసే ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ ప్రతి రెండేళ్లకోసారి పెంచుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి వివిధ రకాల బ్రాండ్ల మద్యంపై 20 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెంచాలని బ్రూవరీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఇక బ్రూవరీల ప్రపోజల్స్ తో బీర్ల ధరల పెంపుపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం.

మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల ఆదాయం..!
అయితే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో రాష్ట్రంలో లిక్కర్ రేట్లు సుమారు 15శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ తెలంగాణ సర్కార్ మద్యం రేట్లను 15శాతం మేర పెంచితే ఎక్సైజ్ శాఖకు ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే అదనంగా మరో 5వేల కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరో 5వేల 318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ధరల పెంపు ప్రక్రియ సాగుతోందన్న ప్రచారం కూడా సాగుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2వేల 260 మద్యం దుకాణాలు..
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2వేల 260 మద్యం దుకాణాలకు 1171 బార్లు కూడా ఉన్నాయి. వీటన్నింటికి 6 బ్రూవరీల నుంచి బీర్లు సరఫరా అవుతున్నాయి. ఇక బ్రూవరీల నుంచి ప్రతి ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఇక, ప్రతి ఏడాది దసరా సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి కూడా 10 రోజుల వ్యవధిలో 11 కోట్లకుపైగా మద్యాన్ని మందుబాబులు లాగించారు. అందులో ముఖ్యంగా 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగినట్లుగా సమాచారం.

* తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్..!
* పెరగనున్న మద్యం ధరలు..!
* మద్యం ధరలు పెంచాలని కోరుతున్న బ్రూవరీలు..
* మద్యం ధరలు 15శాతం పెరిగే అవకాశం
* రూ.20 నుంచి రూ.150 వరకు పెరిగే ఛాన్స్
* మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల ఆదాయం..!
* 2024 సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2వేల 838 కోట్ల అమ్మకాలు

 

Also Read : సికింద్రాబాద్ ఆలయ విధ్వంసం.. ముంబై మోటివేషనల్ స్పీకర్ మునవర్‌పై కేసు నమోదు..!