సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరైనా స్వాగతించాల్సిందేనని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్లో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై 10టీవీతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నా జోక్యం ఇందులో ఉండదు. ఫిరాయింపుల విషయంలో మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదు. 2014 నుంచి ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు అనే విషయంపై చర్చకు సిద్ధమా?
జనహిత పాదయాత్ర ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏడాదిన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేశాం. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. నేతలకు నామినేటెడ్ పదవుల అంశం త్వరలో కొలిక్కి వస్తుంది” అని చెప్పారు.