Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలాఉంటే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీంతో పోలీసులు గత రెండు రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేశారు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మళ్లీ గురువారం రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు.
రాజాసింగ్ మరోసారి అరెస్ట్ తో పాతబస్తీ ప్రాంతాల్లో టెన్షన్ వాతారణం నెలకొంది. మరోవైపు శుక్రవారం కావడం ముస్లింలు ప్రార్థనల సమయంలో, తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళనలకు దిగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీలు, ధర్నాలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వేల మంది ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వీలున్నంత వరకు ముస్లింలు దగ్గరలోని మసీదుల్లో, నివాసాల్లో ప్రార్థనలు నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు, పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు కీలక సూచనలు చేశారు. ఎవరూ ధర్నాలు, నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించిన ఆయన.. గతంలో కొందరు బీజేపీ నేతలు పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని రెచ్చగొట్టారంటూ పేర్కొన్నారు. మూడు రోజులుగా చేసిన శాంతియుత ఉద్యమం ఫలితంగా తెలంగాణ సర్కార్ పీడీయాక్ట్ పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను జైలుకు పంపించిందని ఒవైసీ అన్నారు. ప్రార్థనల సమయంలో, తరువాత ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా సహకరించాలని పాతబస్తీ వాసులకు అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.