Telangana Election 2023
Election Commission : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో భాగంగా గత కొద్దిరోజులుగా అభ్యర్థులు, నేతల ప్రచారాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. కాగా నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుంది. 30న పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీస్ సిబ్బంది పాల్గోనున్నారు. 65వేల మంది తెలంగాణ పోలీసులతో పాటు 18వేల మంది హోంగార్డులు ఉన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలుకూడా రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే సెంట్రల్ ఫోర్స్ రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్రంలో 4,400 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాల ద్వారా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొంటారు.
Also Read : Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ పర్వంపై అందరి దృష్టి
పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చని.. ఆ తరువాత ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. నలుగురు కంటే ఎక్కుమంది ఒకేచోట ఉండకూడదని సూచించింది.