Telangana Election: మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఈసీ వార్నింగ్
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.
![Telangana Election: మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఈసీ వార్నింగ్ Telangana Election: మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఈసీ వార్నింగ్](https://10tv.in/wp-content/uploads/2023/11/Telangana-Election-Campaigns-End-day.jpg)
Telangana Election Campaigns End day
Telangana Election Campaigns End day : ఇప్పటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలు, ఎన్నికల హామీలతో ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, ఆత్మీయ సభలు అంటూ ఓటర్లను ఊదరగొట్టిన రాజకీయ నేతల మైకులు మూగబోనున్నాయి. మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవటానికి సమయం ఉంది. ఆ తరువాత ఇక ఏ నేత మైకుల ముందు మాట్లాడకూడదు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించకూడదు. ఎన్నికల ప్రచారం సమయం ముగియనుండటంతో ఇక నేతల మైకులు సైలెంట్ అవ్వాల్సిందే.
ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చని.. ఆ తరువాత చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. సాయంత్రం 5.00గంటల తరువాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.. నలుగురు కంటే ఎక్కుమంది ఒకేచోట ఉండకూడదని సూచించింది.
Also Read : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ.. ఇంటింటికి కార్యకర్తల బృందాలు
మరికొద్ది గంటలే ప్రచారానికి సమయం మిగిలి ఉండటంతో ఉన్న సమయాన్ని ఆయా పార్టీల నేతలు సద్వినియోగం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేసుకోవడానికి గడువు ఉండటంతో ఇప్పటికే బ్యాలెన్స్ ఉన్న ప్రాంతాలను ఆయా పార్టీల నేతలు పూర్తి చేసుకునే యత్నంలో ఉన్నారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ప్రధాన పార్టీల నేతలంతా ఈరోజు సుడిగాలి ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కూకట్పల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ఆఖరి రోజు ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాహుల్గాంధీ.. జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్ యూనియన్, జీహెచ్ఎంపీ వర్కర్స్ యూనియన్ నేతలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇక పదకొండున్నరకు నాంపల్లి నియోజకవర్గంలో రాహుల్గాంధీ రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్లో పలుచోట్ల కార్నర్ మీటింగ్ల్లో పాల్గొంటారు. ఇక ప్రియాంక గాంధీ పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం పదకొండున్నరకు జహీరాబాద్లో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించే సభలో పాల్గొంటారు.
ఇక గులాబీ బాస్ కేసీఆర్ కూడా వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్నారు. కేసీఆర్ ఇవాళ మూడు నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతోపాటు.. గజ్వేల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇలా ఆయా పార్టీల నేతలు ఆఖరి రోజును సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు.
ఇక నవంబర్ 30న జరగబోయే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 3న కౌటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఆయా పార్టీల నేతల భవితవ్యం తేలిపోనుంది.
కాగా.. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు గెలుపు ధీమాతోనే ఉన్నాయి. బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని హ్యాట్రిక్ కొడతామనే ధీమాతో ఉంటే. తొలిసారిగా బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అంటూ ఆ పార్టీ అగ్రనేతలు మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ కూడా సభల్లో అదే విషయాన్ని ప్రస్తావిస్తు ధీమా వ్యక్తంచేశారు. ఇక కాంగ్రెస్ గతంలో కూడా దూకుడు మీదుంది. గెలుపు ఖాయం అని, కేసీఆర్ ను ఇంటికి పంపించటం ఖాయమంటోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాతో పీసీసీ రేవంత్ రెడ్డితో పాటు ఆపార్టీ నేతలు కూడా నమ్మకంతో ఉన్నారు. మరి విజయం ఎవరిని వరించనుందో.. ప్రభుత్వాన్ని ఏపార్టీ ఏర్పాటు చేయనుందో వేచి చూడాలి.