Indiramma Illu
Indiramma Illu : తెలంగాణలోని అర్హులైన ప్రతిఒక్క పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. ఈ ఇండ్ల నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో సర్కార్ ఇందిరమ్మ లబ్ధిదారులకు మరో గుడ్న్యూస్ చెప్పింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం అనుసంధానం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు గృహ నిర్మాణానికి తోడుగా నిలవడంతోపాటు గ్రామీణ నిరుద్యోగులకు కనీసం 90రోజుల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. వారిలో 2.50 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. మిగిలిన వారిలో జాబ్ కార్డులేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి ఉపాధిహామీలో జాబ్కార్డు ఉన్న లబ్ధిదారులకు బేస్మెంట్ స్థాయి వరకు 40రోజులు, స్లాబ్ లెవల్ వరకు 50రోజుల పని దినాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం లభిస్తోంది. ఈ లెక్కన 90రోజుల పాటు పని చేయడం ద్వారా సదరు ఒక్కో కూలీకి రూ.27,630 చెల్లించనున్నారు. దీంతో సొంతింటి నిర్మాణానికి కూలీ పని చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది.
అంతేకాదు.. స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం)లో టాయిలెట్స్ నిర్మాణంతోపాటు ఇతర పారిశుద్ధ్య పనులకు రూ.12వేలు ఇవ్వనుంది. దీనికితోడు ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద రూ.72వేలు ఇస్తుండగా.. ఇప్పుడు ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ నిధులు అందించనుండటంతో లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.