Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని
- Harishth Thanniru
- Published On : October 16, 2025 / 08:21 AM IST
Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు సూచించింది. బుధవారం సచివాలయం నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సీజన్లో 40లక్షల టన్నుల సన్నాలు, మరో 40లక్షల టన్నుల దొడ్డు ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
Also Read: Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా.. మాజీ ఓఎస్డీ అరెస్ట్ కు పోలీసుల ప్రయత్నం
కొనుగోలులోనూ సరికొత్త రికార్డుకు చేరుకుంటామని, ఈ లక్ష్యాన్ని చేరడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదురైతే నాతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ను సంప్రదించొచ్చునని.. 24గంటలు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఇబ్బందులు చెప్పేందుకు 1800-425-00333/1967 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని ఉత్తమ్ తెలిపారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత వివరాలు నమోదైన 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, సన్నాలకు బోనస్ కూడా అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
