Governor TamiliSai : రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్ సిద్ధమవ్వగా మరోవైపు గవర్నర్ తమిళి సై కొత్తగూడెం పర్యటనకు రెడీ అయ్యారు. అయితే, ముందుగా గవర్నర్ తమిళి సై కొత్తగూడెం పర్యటన వార్తలే బయటకు వచ్చాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే పర్యటన ప్రకటన వెలువడింది. గవర్నర్ తమిళి సై శనివారం రాత్రికే కొత్తగూడెం రైలులో ప్రయాణించనున్నారు. గవర్నర్ ఆదివారం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సాయంపై ఆమె ఆరా తీయనున్నారు.
వాస్తవానికి గవర్నర్ తమిళిసై పర్యటన వల్ల అప్పటికప్పుడు బాధితులకు సాయం అందేది ఏమీ ఉండదు. అయినా సరే తమిళి సై ముందుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధం అయ్యారు. దీనికోసం ఆమె ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి ఆకస్మాత్తుగా ఏరియల్ సర్వే ప్రకటన వెలువడింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎప్పటి నుంచో గవర్నర్ తమిళి సై పర్యటనలకు అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదు.
CM KCR : వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
దీనిపై గవర్నర్ తమిళిసై నేరుగానే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేశారు. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ దుమారం రేగిన చాల కాలం తర్వాత ఇటీవలే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఆ సమయంలో రాజ్ భవన్ లో మర్యాదపూర్వక భేటీ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీటింగ్ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చాయి. సీఎం కేసీఆర్ సీటు వీరికి దూరంగా వేయటంపై ఆసక్తికర చర్చ జరిగింది.
తాజాగా గవర్నర్ తమిళి సై వరద ముంపునకు గురైన ప్రాంతాల సందర్శన కూడా రాజకీయంగా దుమారం రేపే అవకాశం కన్పిస్తోంది. జిల్లాల మంత్రులు తప్ప..భారీ విపత్తు జరిగినా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టడం లేదని..కేవలం రాజకీయాల మీదే ఫోకస్ పెట్టారంటూ విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన వార్తలు బయటకు వచ్చాక సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే వార్తలు వెలువడ్డాయి. భారీ వర్షాల కారణంగా ప్రకృతి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్ : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనుంది. ఈ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షాసమావేశాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.