Traffic Challan : ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు సంచలన కామెంట్స్.. వాహనదారులకు బిగ్షాక్..
Traffic Challan : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి చలానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. పలు సందర్భాల్లో రాయితీపై ..
- Harishth Thanniru
- Published On : November 26, 2025 / 08:16 AM IST
Traffic Challan
Traffic Challan : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి చలానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. పలు సందర్భాల్లో రాయితీపై చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి చలానాలు విధిస్తూ తరువాత అందులో రాయితీలు ఇవ్వడం.. చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపర్చడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాయితీలు ఇవ్వడం ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుందని పేర్కొంది.
Also Read: GHMC: 27 మున్సిపాలిటీలు విలీనం.. భారీగా విస్తరించనున్న జీహెచ్ఎంసీ.. రూ.2కోట్ల నిధులు.. లిస్ట్ ఇదే..
ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా వ్యవస్థను సవాల్ చేస్తూ హైదరాబాద్ తార్నాకకు చెందిన వి. రాఘవేంద్రచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ట్రిపుల్ రైడింగ్కు 1988 మోటారు వాహనాల చట్టం సెక్షన్ 128 రెడ్విత్ 177 ప్రకారం.. రూ. 100 నుంచి రూ. 300 మాత్రమే జరిమానా విధించాలి. కానీ, దీనికి విరుద్ధంగా 2019 నిబంధన ప్రకారం.. రూ. వెయ్యి విధిస్తున్నారని అన్నారు. ఇది చెల్లదని వాదించారు. 2019లో సవరణ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోకపోవడంతో 1988 నిబంధనల ప్రకారమే చలానా జారీచేయాల్సి ఉందన్నారు
ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె తమ వాదనలు వినిపించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 200 కింద ట్రాఫిక్ ఉల్లంఘనలనేవి జరిమానా విధించదగ్గ నేరాలని తెలిపారు. అందుకు సంబంధించిన జరిమానాల వివరాలను వెల్లడిస్తూ ప్రభుత్వం 2007 జీవో 54 జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం జరిమానాను పెంచుతూ 2011లో ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత చలానా వ్యవస్థలో నిబంధనలన్నీ పొందుపర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కేంద్ర మోటారు వాహన నిబంధన 167 కింద ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి నిబంధనలతో సహా చలానాలు జారీచేయాల్సి ఉందన్నారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నందున అది ఏ దశలో ఉందో వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబరు 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
