Minister Sridhar Babu: ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు "ఇంటింటికి ఇంటర్నెట్" కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)స్పష్టం చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 4, 2026 / 10:05 PM IST
Telangana mandates t fiber internet connectivity for all government offices Minister Sridhar babu
- ప్రభుత్వ ఆఫీసుల్లో టీ-ఫైబర్ సేవలు
- ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులు బంద్
- ఇంటింటికీ వేగవంతంగా ఇంటర్నెట్ సేవలు
Minister Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సచివాలయంలో టీ-ఫైబర్ (T-Fiber) పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని వేగవంతం చేయడంలో టీ-ఫైబర్ పాత్ర అత్యంత కీలకమని, అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే నెట్వర్క్ పరిధిలోకి రావడం వల్ల పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ఇంటర్నెట్కు స్వస్తి – టీ-స్వాన్ బదిలీ వేగవంతం:
ప్రభుత్వ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ శాఖలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్ నెట్వర్క్ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్కు బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రతీ ప్రభుత్వ ఆఫీసుకు కనెక్టివిటీ కల్పించడం ద్వారా డిజిటల్ పాలనను ఒకే వేదికపైకి తీసుకురావచ్చని వివరించారు.
ఇక ఇంటింటికీ ఇంటర్నెట్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ప్రారంభ దశ నుంచే పూర్తి స్థాయి టీ-ఫైబర్ సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు “ఇంటింటికి ఇంటర్నెట్” కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
