Telangana Lockdown Relaxations : తెలంగాణలోనూ ఢిల్లీ తరహా లాక్డౌన్ సడలింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం. వారం పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ అమల్లో ఉంది.
వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్లకు అనుమతి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 50 శాతం ఆక్యుపెన్సికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్లు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సడలింపులపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో పాజిటివ్ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షల సడలింపు తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.