ప్రతి ఇంట్లోకి కరోనా వైరస్ వచ్చిందని, ఈ వైరస్ ను జయించాలంటే..ధైర్యమే ఒక్కటే మందు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆరు నెలల కాలంలో కరోనాకి చంపే శక్తి లేదని, ఎందుకంటే..99 శాతం మంది కోలుకుని బయటపడుతున్నారని తెలిపారు.
2020, సెప్టెంబర్ 06వ తేదీ ఆదివారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో 22 వేల మంది ఆశ వర్కర్లు, 500 మంది ANMలతో ఆయన Zoom ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాకు చికిత్స లేదనే సంగతి అందరికీ తెలిసిందేనని, అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలో కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది, ఇతరులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని గుర్తు చేశారు. కిందిస్థాయిలో పని చేస్తున్న ప్రతొక్కరికీ కరోనాపై పూర్తి అవగాహన వచ్చిందన్న మంత్రి..ప్రజలను కూడా చైతన్యపరిచి అతి త్వరలోనే పూర్తిగా వైరస్ ను నిర్మూలించే విధంగా పనిచేద్దామన్నారు.
https://10tv.in/there-no-coronavirus-symptoms-telangana-people/
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించాలన్నారు. ప్రస్తుత సమయంలో సిబ్బంది పని చేయడం అందరికీ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుందని, ‘భరోసా కల్పించండి. ప్రాణాలు కాపాడండి’ అంటూ ఆశ, ఏఎన్ఎంలకు మంత్రి పిలుపునిచ్చారు.
ప్రస్తుతం వీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, జీతాలు పెంచే విషయంలో తాను సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని హామీనిచ్చారు మంత్రి ఈటెల.