Congress Candidate Munugodu By-Poll : మునుగోడు ఉప ఎన్నికలు..ఈనెలాఖరులోపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో తమ అభ్యర్థిని ఈ నెలాఖరులోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గాంధీభవన్లో సమావేశమయ్యారు.
- bheemraj
- Published On : August 26, 2022 / 03:33 PM IST
Congress Candidate Munugodu By-Poll
Congress Candidate Munugodu By-Poll : మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో తమ అభ్యర్థిని ఈ నెలాఖరులోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గాంధీభవన్లో సమావేశమయ్యారు. పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తదితరులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. టికెట్ ఎవ్వరికిచ్చినా సమిష్టిగా పని చెయ్యాలని నేతలు సూచించారు.
మునుగోడులో టికెట్ ఆశిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత ఉన్నారు. అయితే ఆశావహుల బలాబలాపై సునీల్ కనుగోలు ఇప్పటికే పీసీసీకి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో మునుగోడులో అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయనుంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో… అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది.
ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ప్రియాంకా గాంధీ కూడా మునుగోడుపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర నేతలు కూడా ఉప ఎన్నికలను సీరియస్గానే తీసుకున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్తో రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్రెడ్డి సమావేశమయ్యారు.
టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి పీసీసీ నివేదిక పంపనుంది. ఏఐసీసీ ఆమోదించిన వారినే మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిగా పీసీసీ ప్రకటించనుంది. ఆశావహుల బలాబలాలపై ఇప్పటికే పీసీసీకి సునిల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా.. పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
Munugodu BY-Election : మునుగోడు ఉప ఎన్నికల బరిలో..ఏ పార్టీ నుంచి ఎవరు?
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కోమటిరెడ్డితో చర్చించారు భట్టి విక్రమార్క. కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్నారు ఎంపీ కోమటిరెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే ప్రియాంకగాంధీతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారలేదు.
అభ్యర్థి ఎంపికపై గాంధీభవన్లో జరిగిన సమావేశానికి రాలేదు. ఏ సమావేశానికి రాకపోతుండటం, నియోజకవర్గంలో ఆయన మద్దతు లేకుండా పార్టీ గెలవడం కష్టమనే అభిప్రాయంతో ఉండటంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. అందులో భాగంగానే భట్టి… వెంకట్రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపైనా కోమటిరెడ్డితో భట్టి చర్చించినట్లు సమాచారం.
