Telangana : వరంగల్ కమిషనరేట్ పరిధిలో సభలు .. ర్యాలీలు నిషేధం . .అతిక్రమిస్తే కఠిన చర్యలు : సీపీ హెచ్చరిక
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలు జరుపకూడదు అంటూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. మరి బండి సంజయ్ నిర్వహిస్తాను అనే సభ వరంగల్ లో జరుగుతుందా? లేదా?
- nagamani
- Published On : August 26, 2022 / 04:21 PM IST
warangal commissioner ordered ban on meetings and rallies
Telangana : ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా ఆగస్టు 27న వరంగల్ లో బహిరంగ సభ జరిపి తీరుతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలు జరుపకూడదు అంటూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పోలీసు ఆంక్షలు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయని సీపీ స్పష్టం చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ రేపు (ఆగస్టు 27,2022) హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు బీజీపీ సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సభను అడ్డుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సభ జరుగుతుందా? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల జరుగనున్న క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరీగా మాటల యుద్ధం జరుగుతోంది.విమర్శలు ప్రతివిమర్శలతో ఇరు పార్టీల నేతలు హీట్ పుట్టిస్తున్నారు. గెలుపు కోసం వ్యూహాలపై ప్రతి వ్యూహాల్లో పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి.
