Warangal : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అంశం స్ధానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన చీమల సతీష్ అనే వ్యక్తి రోజూ లాగే ఆరు బయట మంచం మీద పడుకున్నాడు. తెల్లారి లేచే సరికి అతను మంచం మీద కనపడలేదు.
చుట్టుపక్కల అతని గురించి వెతికినా దొరకలేదు. కానీ…. అతను పడుకున్నమంచం పక్కన చేతబడి చేసి ఉండడం చూసి ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సతీష్ పడుకున్న మంచం పక్కన మనిషి బొమ్మ , ముగ్గు గీసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
అతడ్ని సంప్రదించాలనుకుని సెల్కు ఫోన్ చేయగా అది మంచంమీదే ఉంది. సతీష్ కనపడకపోవటంతో గ్రామస్తులు భయపడుతున్నారు. సతీష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి వాళ్లెవరు ఇంట్లో లేరు. భార్య, తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
గతంలోనూ గ్రామమానికి చెందిన ఒక వ్యక్తి ఇదే తరహాలో అదృశ్యమైనా ఇప్పటి వరకు అతని ఆచూకీ లభ్యంకాలేదని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.