YS Sharmila
YS Sharmila – KCR: అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యంగా తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్రం దివాళా అయిందని చెప్పారు. పరిమితి మించి దొర తెచ్చిన అప్పులు అక్షరాల రూ.5 లక్షల కోట్లని ట్వీట్ చేశారు.
” ఇంత అప్పు చేసినా దేనికీ డబ్బు లేదు. ఖజానా ఖల్లాస్. పథకాల నుంచి బిల్లుల చెల్లింపుల దాకా అన్ని బంద్. కాంట్రాక్టర్లకు బిల్లుల కింద రూ.37 వేల కోట్లు, డిస్కంలకు రూ.25 వేల కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.వెయ్యి కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.5 వేల కోట్లు, సున్నా వడ్డీలకు రూ.17వేల కోట్లు, ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.6 వేల కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే దొర బాకీల జాబితా చాంతాడు కన్నా పొడువే.
అభివృద్ధికి అప్పులు తెస్తే తప్పా? అని అడిగే కేసీఆర్.. తెచ్చిన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టినట్లు? ఎక్కడ అభివృద్ధి చేసినట్లు? నెలనెలా రాష్ట్ర ఆమ్దానీ ఎక్కడ పోతున్నట్లు? లక్షల కోట్లు అప్పులు తెచ్చి అర చేతిలో 3డీ చూపి.. కమీషన్ల కింద దొర ఖజానాకే నిధులు అన్ని దారి మళ్లినయ్. పనికి రాని ప్రాజెక్ట్ చెప్పి తెచ్చిన అప్పులు దొర కడుపు నింపినయ్.
ఒక్కో తలపై 2లక్షల అప్పు పెట్టి, మొత్తం దోచుకుతిన్నరు తప్పితే రెండు రూపాయల మేలు చేయలే. ఆఖరికి ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రానిది. ఇప్పటికే 35 వేల ఎకరాల భూములు అమ్మిన దొర.. ఉన్న భూములు అమ్మితే తప్పా సర్కారును నడిపించలేని దుస్థితి. పైకి ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలుకుతూనే.. తెలంగాణను మరో 40 ఏండ్లు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఖాళీ బిందెకు బంగారు పూత, ఇదే కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ ” అని షర్మిల విమర్శించారు.
Pawan Kalyan: నేను మీ సతీమణి భారతీ మేడమ్ గురించి మాట్లాడానా జగన్?: పవన్ కల్యాణ్