తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం

తిరుమలలో మంగళవారం (అక్టోబర్ 8, 2019)న శ్రీవారి పుష్కరిణిలో వేదమంత్రాలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో అనిల్కుమార్ సంఘాల్ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 32 లక్షల లడ్డూలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఈ రోజు ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 3.00 నుండి 6.00 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఏ. పి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాధ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.