Weather Updates: ఏపీలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం, ద్రోణి ఎఫెక్ట్ తో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. నాన్ స్టాప్ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్థంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరికొన్ని రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. వర్షం సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలన్నారు.
సోమవారం (15-09-25).. ఈ జిల్లాల్లో వానలు పడే అవకాశం..
* అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం.
ఇక, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిల్లీమీటర్లు, పెద్దకూరపాడులో 40.2 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముక్కములలో 39 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అటు గుంటూరు నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్ బరస్ట్ తరహా వాన పడింది. దీంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోయారు. అమరావతి, సత్తెనపల్లి, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ వానలు దంచికొడుతున్నాయి.