మత సామరస్యం : కరోనా కేర్ సెంటర్గా గోద్రా మసీద్
కరోనా కష్టకాలంలో గోద్రా మసీదు నిర్వాహకులు పెద్ద మనస్సును చాటుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన మాటను మరోసారి నిజం చేస్తూ.. కులం, మతం అంతరాలను పక్కనపెట్టి గోద్రా మసీదును కరోనా కేర్ సెంటర్ గా మార్చారు. మసీదులోని ఒక ప్లోర్ మొత్తానని కోవిడ్ బాధితులకు చికిత్స చేసేందుకు ఇచ్చారు.
గుజరాత్లో వ్యాధిబారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజు పెరుగుతూన్న క్రమంలో ఎన్ని కోవిడ్ సెంటర్లు ఉన్నా సరిపోవటంలేదు. కరోనా బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అయినా కరోనా సోకిన బాధితులు పెరుగుతూనే ఉన్నారు. కానీ తగినంతగా ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన గోద్రాలోని షేక్ మజావర్ రోడ్లో ఉన్న ఆడమ్ మసీదు నిర్వాహకులు తమ మందిరాన్ని కరోనా కేర్ సెంటర్గా మార్చారు.
జూలై 11 నుంచి దీన్ని అందుబాటులోకి తేవటంతో గ్రౌండ్ ప్లోర్ను మహిళల కోసం కేటాయించి వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో ముస్లిం మహిళలతో పాటు ఇతర వర్గాలకు చెందిన కరోనా బాధితులు కూడా చికిత్స పొందుతున్నారు.
మసీదులో 50 పడకలను ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్యాధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ముందుగా 32 బెడ్లను ఏర్పాటు చేయగా.. 16 మంది చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.