Vijayasai Reddy : ప్రభుత్వం వచ్చాక ఆ అధికారులపై చర్యలు ఉంటాయి- విజయసాయిరెడ్డి వార్నింగ్

నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని కోరుతున్నాం. వాళ్ళ అక్రమాలన్నీ రికార్డుల్లో ఉంటాయి.

Vijayasai Reddy : ప్రభుత్వం వచ్చాక ఆ అధికారులపై చర్యలు ఉంటాయి- విజయసాయిరెడ్డి వార్నింగ్

Vijayasai Reddy (Photo Credit : Facebook)

Vijayasai Reddy : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పోలీస్, రిటర్నింగ్ అధికారులపై చర్యలు ఉంటాయని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.

”పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో కొందరు పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారు. పట్టాభి రామిరెడ్డి లాంటి వ్యక్తి కూడా వెళ్ళారు. కొందరు బీఎల్ఓలు నిబంధనలు ఉల్లంఘించారు. కొందరు అధికారులు కూటమికి కొమ్ముకాస్తున్నారు. నెల్లూరు రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మట్ కు ఆధారాలతో ఫిర్యాదు చేశాం. 7మంది మీద ఫిర్యాదు చేస్తే.. ఒకరి మీదే చర్య తీసుకున్నారు. మిగిలిన 6మందిపై చర్యలు లేవు. అధికారుల మీద చర్యలు తీసుకుంటే కుటుంబంలోని బీజేపీకి కోపం వస్తుందని భావించి ఒకవైపు కొమ్ము కాస్తున్నారు. నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులపై చర్యలు ఉంటాయి. వాళ్ళ అక్రమాలన్నీ రికార్డుల్లో ఉంటాయి. అక్రమాలకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నాం. మేము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు.

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ రౌడీలు. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారు. వీళ్ళు రౌడీ కార్యక్రమాలు చేస్తున్నా వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ఎవరు కారకులో పోలీసులకే తెలుసు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్, రిటర్నింగ్ అధికారులపై చర్యలు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాం. కూటమి వల్లే కొందరు అధికారులను బదిలీ చేస్తున్నారు. కదిరిలో ఒక అధికారి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే ఫిర్యాదు చేశాం. ఉన్నతాధికారి ఫిర్యాదు చేస్తే ఆయన చర్యలు తీసుకున్నారు. ఈ ఉన్నతాధికారిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అధికారుల బదిలీల వెనుక కారణాన్ని ఎన్నికల సంఘమే చెప్పాలి” అని విజయసాయిరెడ్డి అన్నారు.

Also Read : కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు.. మెగాస్టార్ చిరంజీవిపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు