రూ.కోటి ఫైన్ : కోడెల శివరామ్ హీరో మోటార్స్ కు భారీ జరిమానా

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామ్ కి చెందిన గౌతమ్ హీరో మోటార్స్ కు రవాణశాఖ భారీ జరిమానా

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 07:46 AM IST
రూ.కోటి ఫైన్ : కోడెల శివరామ్ హీరో మోటార్స్ కు భారీ జరిమానా

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామ్ కి చెందిన గౌతమ్ హీరో మోటార్స్ కు రవాణశాఖ భారీ జరిమానా

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామ్ కి చెందిన గౌతమ్ హీరో మోటార్స్ కు రవాణశాఖ భారీ జరిమానా విధించింది. ఏకంగా కోటి రూపాయలు ఫైన్ వేస్తూ రవాణశాఖ నోటీసులు ఇచ్చింది. రవాణశాఖ అనుమతి లేకుండా గౌతమ్ హీరో మోటార్స్ నుంచి వెయ్యి బైక్ లు అమ్మినట్టు అధికారులు గుర్తించారు.

కోడెల శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్ ను రవాణశాఖ ఇదివరకే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. హీరో మోటార్స్ షోరూమ్ లో రవాణ శాఖ అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది ఆగస్టు 2 వరకు జరిపిన వాహన విక్రయాల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ఎలాంటి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పన్ను కట్టకుండానే 1025 వాహనాలను విక్రయించినట్లు కనుగొన్నారు. వెంటనే షోరూమ్ ని సీజ్ చేశారు. ఏపీ మోటారు వాహనాల చట్టం ప్రకారం షోరూమ్ బిజినెస్ అనుమతిని రద్దు చేశారు.

బైక్‌లకు టీఆర్‌ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్‌ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకు గండి కొట్టారని రవాణశాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000–1300 వరకూ చెల్లించాలి. లైఫ్‌ ట్యాక్స్‌ కింద బైక్‌ ధరపై 9-14శాతం కట్టాలి. గౌతమ్‌ షోరూమ్‌ నుంచి విక్రయించిన బైక్‌లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైక్ కి రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్‌ ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారని విచారణలో వెలుగుచూసింది.
 

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. హైదరాబాద్ లో తన ఇంట్లో ఆయన ఉరి వేసుకున్నారు. కోడెల ఆత్మహత్య కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్నది కారణాలు తెలియాల్సి ఉంది. కోడెల కుటుంబసభ్యులపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. కే-ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసులు బుక్ చేశారు పోలీసులు.