IPL Tickets : ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా పై పోలీసులు దృష్టి సారించారు.
ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా పై పోలీసులు దృష్టి సారించారు. బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 101 టికెట్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారు అన్న పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులు బెంగళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్కు చెందిన న్యాలకంటి శామ్యూల్గా గుర్తించారు.
Pat Cummins : ఆర్సీబీ పై హైదరాబాద్ ఓటమి.. కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు
రమణ అనే వ్యక్తి వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బ్లాక్లో టికెట్లు అమ్ముతూ చెన్నైలో అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్కు విపరీతమైన క్రేజ్ ఉండడంతో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయాలకు నిందితులు పక్కాగా ఫ్లాన్ చేశారన్నారు. వెయ్యికి పైగా వాట్సాప్ గ్రూపులను నిందితులు నడుపుతున్నట్లు గుర్తించారు. ఒక్కొ టికెట్ను భారీ ధరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు.