అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం
కొత్తగూడెం : ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువజంట మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరీక్షించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గత కొంతకాలంగా మాచర్ల వినోద్ అనే 25 యువకుడు తేజస్విని అనే 17 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. త్వరలోనే పెళ్లి చేస్తామని మాటిచ్చారు. అప్పటి నుంచి వినోద్..తేజస్వి ఒకే ఇంట్లో రామాంజనేయ కాలనీలో కలిసే జీవిస్తున్నారు. ఇటీవలనే తేజస్విని ఇంటర్ పరీక్షలకు కూడా రాసింది. వీరితో పాటు వినోద్ కు వరుసకు బావమరిది అయిన మరో యువకుడు కూడా ఉంటున్నారు.
Read Also : యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం
వినోద్కి మద్యం అలవాటు ఉండటమే కాకుండా అతనిపై పోలీసు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి (మార్చి 17)న వినోద్, అతని బావమరిది, మరికొందరు స్నేహితులందరూ కాలనీలోనే మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తరువాత అతని స్నేహితులు అంతా వెళ్లిపోయారు. తరువాత వినోద్, అతని బావమరిదులు కూడా ఇంటికి వెళ్లారు. కానీ తెల్లారేసరికి వినోద్ ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేరని భావించిన స్థానికులు అనుమానం వచ్చి కాలిన ఇంటిని పరిశీలించడంతో వినోద్, తేజస్విని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉన్నాయి. ఇల్లు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. వారితో ఉన్న వినోద్ బావమరిది మాత్రం కనిపించలేదు.
స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వినోద్ బావమరిది కోసం గాలిస్తున్నారు. ఎవరైనా కావాలనే నిప్పంటించారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా..కనిపించకుండా పోయిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే కోణాల్లో కొత్తగూడెం డీఎస్పీ డాక్టర్ ఎస్ఎం.అలీ, చుంచుపల్లి సీఐ కరుణాకర్, ఎస్సై ఎల్.రవీందర్ దర్యాప్తు నిర్వహిస్తున్నారు.